సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ కుమార్తె సౌంద‌ర్య 2010లో పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్‌ని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. కొన్నాళ్ళ త‌ర్వాత‌ వారి ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలు తలెత్తాయి. సర్దుకుపోవడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. చివరికి ఆ ఇద్దరూ విడిపోయేందుకే నిర్ణయించుకున్నారు. 2017లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. వీరి కుమారుడు వేద్‌ కృష్ణ సౌంద‌ర్య ద‌గ్గ‌రే ఉంటున్నాడు. అయితే సౌంద‌ర్య మ‌రోసారి పెళ్లి చేసుకోనుంద‌నే వార్త కోలీవుడ్‌లో దావానంలా పాకింది. నటుడు, వాణిజ్యవేత్త విశ్వగణ్ వనంగమూడిని సౌంద‌ర్య‌ పెళ్లి చేసుకోనుందట‌. విశ్వగణ్‌కి కూడా ఇది రెండో వివాహమే అంటున్నారు.

విశ్వ‌గ‌ణ్ ‘వంజగర్ ఉల్గామ్’ అనే సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహ నటుడిగా పనిచేశారు. సినిమాలతో పాటు ఆయన ఫార్మాసూటికల్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఇక సౌంద‌ర్య‌ ద‌ర్శ‌కురాలిగా త‌న తండ్రి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన‌ కొచ్చాడియాన్ చిత్రంతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర‌లో వీఐపీ 2 అనే చిత్రం కూడా తెర‌కెక్కించింది. కెరీర్ తొలినాళ్ళ‌లో గ్రాఫిక్ డిజైన‌ర్‌గా ప‌ని చేసింది సౌంద‌ర్య‌. సౌందర్య, విశ్వ‌గ‌ణ్‌ల వివాహం 2019, జనవరి నెలలో జ‌ర‌గ‌నుందని తెలుస్తుంది.